మన చెత్త-మన బాధ్యత.. మురికి కాలువలో చెత్తను తొలగించిన మంత్రి హరీష్ రావు

ts-minister-harish-rao-participated-in-mana-chetta-mana-badhyatha-program-in-siddipet

సిద్దిపేట: చెత్తవల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు మంత్రి హరీశ్‌ రావు. వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని మంత్రి అన్నారు. నడకతో ఆరోగ్యం, చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణం కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సిద్దిపేటలో మన చెత్త-మన బాధ్యత అంటూ ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 18వ వార్డులో నడుస్తూ మురికి కాలువలో పేరుకుపోయిన పేపర్లు, కవర్లను స్వయంగా తొలగించారు. చెత్త పేరుకుపోవడంతో అపరిశుభ్రమైన వాతావరణం ఉంటుందని చెప్పారు. ఇంటిని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు.. దోమల నివారణ కార్యక్రమంలో భాగంగా కోకాపేటలోని తన నివాసంలో పరిసరాలను శుభ్రం చేసిన విషయం తెలిసిందే.

ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన కుటుంబం, సమాజం సాధ్యమవుతుందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. వర్షాకాలంలో అంటు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకున్నా, నీటి నిల్వ ఉండటంతో దోమలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుందని చెప్పారు. వాటి ద్వారా వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే దోమల నివారణకు అందరూ కృషి చేయాలని సూచించారు. పూల కుండీలు, కొబ్బరి చిప్పల్లో నిల్వఉండే నీళ్లలో దోమల లార్వా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటే ప్రతీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఆరోగ్యం విషయంలో నివారణ కంటే జాగ్రత్త ఉత్తమం అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. వ్యాధులు రాకుండా ముందుగా జాగ్రత్త పాటించడం వల్లనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని చెప్పారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.