రేపు ప్రభుత్వ బంజారా ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్
హైదరాబాద్ : ప్రభుత్వ బంజారా ఉద్యోగులకు ప్రభుత్వం రేపు ప్రత్యేక క్యాజువల్ లీవ్ ప్రకటించింది. గురువారం సేవాలాల్ జయంతి సందర్భంగా క్యాజువల్ లీవ్ను ప్రభుత్వం ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు క్యాజువల్ లీవ్ ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. క్యాజువల్ లీవ్ ప్రకటించడంతో బంజారా కమ్యూనిటీకి చెందిన ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
సంత్ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15వ తేదీన అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని గొల్లలదొడ్డి దగ్గరున్న సేవాగఢ్లో జన్మించారని బంజారాల విశ్వాసం. ఆయన గొప్ప సంఘ సంస్కరణవాది. ఆధ్యాత్మిక గురువు. జగదంబకు అత్యంత ప్రియ భక్తుడు. బ్రహ్మచారి అయిన సేవాలాల్.. తన అద్వితీయ బోధనలతో యశస్సును పొందారు. బంజారాల హక్కులు, నిజాం, మైసూరు పాలకుల దాష్టీకాలకు వ్యతిరేకంగా.. 18వ శతాబ్దంలో సాగిన పోరాటంలో సంత్ సేవాలాల్ కీలక పాత్ర పోషించారు.