నేటి నుంచి టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు
అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు..
హైదరాబాద్ః అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు కొనసాగుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ 1006 దరఖాస్తులను పరిశీలించింది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి విధివిధానాలను ఈ సమావేశంలో చర్చించారు. ఇప్పటికే 35 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై క్లారిటీ వచ్చిందని.. మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ (పీఈసీ) ఫోకస్ పెట్టింది.
అభ్యర్థుల ఎంపికకు సంబంధించి విధివిధానాలను ఎలక్షన్ కమిటీ సమావేశంలో చర్చించారు. తర్వాత మరోసారి ఎలక్షన్ కమిటీ సమావేశమై జాబితాను షార్ట్ లిస్ట్ చేసి స్క్రీనింగ్ కమిటీకి పంపనుంది. పార్టీకి ఆయా నియోజకవర్గాల్లో బలం ఎంత ఉంది? అభ్యర్థితో పార్టీకి కలిసి వచ్చే అదనపు అంశాలపై కాంగ్రెస్ సర్వే చేయనుంది. ఈ సమావేశంలోనియోజకవర్గాల వారీగా ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో జాబితాను రెడీ చేశారు. నియోజకవర్గాల వారీగా అర్జీలను వేరు చేశారు. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో వచ్చిన దరఖాస్తులను.. జనరల్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చిన వేర్వేరుగా పరిశీలించారు. అలాగే బీసీలకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల సంఖ్యను కూడా నియోజకవర్గాల వారీగా వేరు చేసి పరిశీలిస్తున్నారు.
అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి ఇల్లందులో అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. ముఖ్య నేతలకు సంబంధించిన కొడంగల్, జగిత్యాల, మంథని, మధిర లాంటి కొన్ని చోట్ల ఒకటే అప్లికేషన్ వచ్చినట్లు చెబుతున్నారు. ఇక కొంతమంది ముఖ్య నేతలతో కూడిన కాంగ్రెస్ మొదటి జాబితా ఇలా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోసారి ఎలక్షన్ కమిటీ సమావేశమై.. జాబితాను షార్ట్ లిస్ట్ చేసి స్క్రీనింగ్ కమిటీకి పంపనుంది. పీఈసీ ఇచ్చే నివేదికపై మూడు రోజుల పాటు పీఈసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ సీనియర్లతో స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ చర్చిస్తారు. స్క్రీనింగ్ కమిటీ జిల్లాల వారీగా పర్యటనలు చేసి అభ్యర్థులను ఖరారు చేయనుంది.