రాజ్యసభ నుంచి తృణమూల్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ సస్పెండ్
న్యూఢిల్లీః తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ రాజ్యసభ నుంచి సస్పెండ్ అయ్యారు. బుధవారం లోక్సభలో భద్రతా ఉల్లంఘన ఘటనపై ఈరోజు రాజ్యసభలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. స్మోక్ అటాక్ ఘటనపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఆ సమయంలో చైర్మెన్ జగదీప్ తో ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ వాగ్వాదానికి దిగారు. చైర్ ముందు నిలబడి చేతులు ఊపారు. దీంతో చైర్మన్ ఒబ్రెయిన్ ప్రవర్తన సరిగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా హక్కుల ఉల్లంఘనకు ఒబ్రెయిన్ పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సభ నుంచి ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
బుధవారం లోక్సభలో జరిగిన స్మోక్ అటాక్ ఘటనపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఆ సమయంలో చైర్మెన్ జగదీప్.. ప్రతిపక్షాల అభ్యర్థనను తోసిపుచ్చారు. విపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన 28 నోటీసులను చైర్మెన్ తిరస్కరించారు. దీంతో విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఒబ్రెయిన్కి చైర్మన్కి మధ్య వాగ్వాదం నెలకొంది. ఒబ్రెయిన్ ప్రవర్తన సరిగా లేదంటూ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.