పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం : స్కూల్ కు వెళ్తుండగా ఫిట్స్‌.. చెరువులో పడి విద్యార్థిని మృతి

పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ కు వెళ్తున్న విద్యార్థినికి మార్గమధ్యలో ఫిట్స్‌ రాగా..ఆ పక్కనే ఉన్న చెరువులో పడిపోయి..మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే..సీతానగరం మండలంలోని ఆవాలవలస గ్రామానికి చెందిన ఆవాల శ్రావణి(14) అనే విద్యార్థిని గాదెలవలస జడ్పీ ఉన్నత స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతోంది. రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం శ్రావణి సైకిల్‌పై స్కూల్ కు వెళ్తుండగా.. మార్గంమధ్యలో విద్యార్థినికి ఫిట్స్‌ వచ్చింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి జారిపడింది.

ఇది గమనించిన మరో విద్యార్థి.. శ్రావణి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. స్థానికులు, కుటుంబసభ్యులు చెరువులోకి దిగి విద్యార్థినిని బయటకు తీశారు. అయితే అప్పటికే శ్రావణి మృతిచెందింది. విద్యార్థినిపై సైకిల్‌ పడటంతో ఆమె బురదలో కూరుకుపోయి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సత్యం, పార్వతి దంపతులకు శ్రావణి ఏకైక సంతానం. తమ కుమార్తె మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.