ఇబ్రహీంపట్నంలో తీవ్ర విషాదం : ఎమ్మెల్యే కుమారుడి పాదయాత్రలో అపశృతి

ఇబ్రహీంపట్నంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డి ప్రగతి నివేదన పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డుపై ఉన్న జనంపైకి దూసుకొచ్చింది. ఈ ఘటన లో ఒకరు మృతి చెందారు. మరో పదకొండు మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం గాయపడినవారికి చికిత్స అందజేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తిని గడ్డ మల్లయ్య గూడ గ్రామానికి చెందిన నేర్ర జంగయ్య(68)గా గుర్తించారు.

పొలం పనులు ముగించుకుని రంగపూర్ నుంచి గడ్డమళ్లాయగూడ గ్రామానికి ట్రాక్టర్ వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. గాయపడినవారిని ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి మృతుడి కుటుంబసభ్యులతో పాటు గాయపడిన వారిని పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు.