హైదరాబాద్-విజయవాడ మార్గంలో 9వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించేవారు తప్పక తెలుసుకోవాలి. రేపటి నుండి 9వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. పెద్దగట్టు జాతరగా పిలిచే సూర్యాపేట సమీపంలోని దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి వారి జాతర రేపటి నుంచి ప్రారంభం అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపు చేసారు.

హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను సూర్యాపేట సమీపంలోని టేకుమట్ల (మూసీ) బ్రిడ్జి వద్ద జాతీయ రహదారి 65 నుంచి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారి 365 బీబీ మీదుగా మళ్లిస్తారు. భారీ వాహనాలను, సరుకు రవాణా వాహనాలను మాత్రం టేకుమట్ల నుంచి ఖమ్మం జాతీయ రహదారి మీదుగా కోదాడ వెళ్లేలా రూట్‌మ్యాప్ సిద్ధం చేసారు.

అటు విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను బీబీగూడెం, రోళ్లవాగుతండా మీదుగా టేకుమట్ల బ్రిడ్జి మీదకు మళ్లిస్తారు. భారీ, సరుకు రవాణా వాహనాలను కోదాడ, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా నార్కట్‌పల్లి వద్ద జాతీయ రహదారి 65పైకి చేరుకునేలా రూట్‌మ్యాప్ సిద్ధం చేశారు. వాహనదారులు పోలీసులకు సహకరించాలనీ కోరారు.