‘కష్టకాలం ముగిసింది… ఇక ఊపిరి పీల్చుకో పాపా’ అంటూ సామ్ పోస్ట్

Samantha-At-Shaakuntalam-Trailer-Launch
samantha latest instagram post

సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పోస్ట్ ఇప్పుడు అభిమానుల్లో సంతోషం కలిగిస్తుంది. కొద్దీ నెలల క్రితం సామ్ మయోసైటిస్ అనే వ్యాధి బారినపడిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధి బారినపడిన దగ్గరినుండి దీనికి సంబదించిన చికిత్స తీసుకుంటూ సినిమాలకు దూరమైంది. కొద్దీ రోజులుగా చికిత్స తీసుకుంటూ వస్తున్న సామ్..ప్రస్తుతం అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆమె పోస్ట్ పెట్టింది.

“కష్టకాలం ముగిసింది… ఇక ఊపిరి పీల్చుకో పాపా! త్వరలోనే అంతా మామూలుగా అయిపోతుందని హామీ ఇస్తున్నా. ఈ ఏడెనిమిది నెలల్లో ఎంతో బాధాకరమైన పరిస్థితులు చవిచూశావు. వాటిని నువ్వు అధిగమించావన్న విషయం ఎప్పటికీ మర్చిపోవద్దు. మెదడు మొద్దుబారిపోయింది… ఎప్పుడూ ఏదో పరధ్యానం… అయినప్పటికీ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నువ్వు ముందుకెళ్లావు… అదే నువ్వు సాధించిన విజయం. అదెంతో అద్భుతం అనిపిస్తుంది. నీ పట్ల ఎంత గర్విస్తున్నానంటే అంత గర్విస్తున్నాను. నీ పట్ల కూడా నువ్వు గర్వించాలి. నువ్వు చాలా గట్టిదానివి” అంటూ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్ట్ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఈ భామ అమెరికన్ వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్’కు హిందీ రీమేక్ లో నటించేందుకు ఓకే చెప్పింది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తుండగా, ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సృష్టికర్తలు రాజ్ అండ్ డీకే దీన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌లోకి సమంతకు స్వాగతం చెబుతూ ఆమె పాత్రకు ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. లెదర్ జాకెట్, డెనిమ్ జీన్స్‌ ధరించి, కళ్ల జోడు పెట్టుకున్న సమంత చాలా స్టయిలిష్ లుక్ లో లేడీ జేమ్స్‌ బాండ్‌లా కనిపించింది. అమెరికన్ వెబ్‌ సిరీస్‌ లో ప్రియాంక చోప్రా చేసిన ఏజెంట్ నాదియా సింగ్ పాత్రను ఇక్కడ సమంత పోషిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్2లో ఉగ్రవాదిగా కనిపించి మెప్పించిన ఆమె ఇప్పుడు గూఢచారి పాత్రలో ప్రేక్షకులను అలరించనుంది.

అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. భారత్ తో పాటు సెర్బియా, దక్షిణాఫ్రికాలోనూ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇక తెలుగు విషయానికి వస్తే విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషీ’ మూవీ లో సమంత నటిస్తుంది. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ తదుపరి షెడ్యూల్ ఈ వారంలోనే మొదలవనుంది.