హైదరాబాద్ లో కుండపోత వర్షం..ఎవరు బయటకు రావొద్దని హెచ్చరిక

హైదరాబాద్ లో మరోసారి కుండపోత వర్షం కురిసింది. దాదాపు గంటపాటు ఆగకుండా ఉరుములు మెరుపులతో భారీగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెహదీ పట్నం, టోలిచౌకి, అత్తాపూర్ తో పాటు మాసబ్ ట్యాంక్, నాంపల్లి, అఫ్జల్ గంజ్ , హిమాయత్ నగర్, నారాయణగూడ, ముషీరాబాద్ , బంజారా హిల్స్ సహా అనేక ప్రాంతాల్లో కుండపోత గా వాన కురిసింది.

కేవలం గంట వ్యవధిలో 10 సెం.మీ. వర్షం కురవడంతో రోడ్లపై వరద నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి, రోడ్లపై నుంచి వరద నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాయి. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. రెండు గంటల పాటు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని పోలీసులు సూచించారు. వరద ప్రవాహం తగ్గే వరకు వేచి చూడాలని కోరారు.