కేజీ టమాటా రూ.50 లకే అందిస్తున్న ఏపీ సర్కార్

కేజీ టమాటా ధర దాదాపు రూ. 150 ఉండగా..ఏపీ సర్కార్ మాత్రం రూ. 50 లకే అందిస్తుండడం తో ప్రజలు గంటలతరబడి క్యూ లో నిల్చుని వాటిని దక్కించుకుంటున్నారు. గత రెండు నెలలుగా టమాటా ధర తగ్గేదెలా అంటుంటుంది. దీంతో సామాన్య ప్రజలు టమాటా వైపు చూసేందుకు కూడా భయపడుతున్నారు. మరికొంతమంది మాత్రం కేజీ తీసుకునే దగ్గర పావుకేజీ తీసుకుని వెళ్తున్నారు. ఈ తరుణంలో ఏపీ సర్కార్ మార్కెట్ లలో సబ్సిడీ రూపంలో టమాటాలు అందిస్తుంది.

బయట కేజీ రూ. 150 ఉండగా..రైతు బజార్ లలో కేజీ టమాటా రూ. 50 లకే అందిస్తుంది. దీంతో జనం వాటి కోసం ఎగబడుతున్నారు. తెల్లవారుజాము నుంచి మిగతా కూరగాయల మాటేమో గానీ టమాటా కోసం క్యూ కడుతున్నారు. ఒక్కో కుటుంబంలో ఇద్దరిసి ముగ్గురు చొప్పున కూడా వచ్చి లైన్లో నిలుచుని టమాటాలు దక్కించుకుంటున్నారు. ఆధార్ కార్డు తీసుకొస్తే ఒక్కొక్కరికి ఒక్కో కిలో మాత్రమే టమాటా రాయితీపై ఇస్తున్నారు.