నేడు హైకోర్టు సీజేల సదస్సు
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థకు సంబంధించిన పలు అంశాల పరిష్కారానికి శుక్రవారం ఢిల్లీ లో ప్రధాన న్యాయమూర్తుల సదస్సు జరగనుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో జరిగే ఈ సదస్సులో 25 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొంటారు. ఇందులో ప్రధానంగా 2016నాటి ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతి గురించి సమీక్షిస్తారు. అలాగే ప్రజలకు వేగవంతంగా న్యాయం అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చిస్తారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, అన్ని రాష్ట్రాల హైకోర్టు తాత్కాలిక/శాశ్వత ప్రధాన న్యాయమూర్తులు పాలుపంచుకుంటారు. న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు 1953లో తొలిసారి ఇలా ప్రధాన న్యాయమూర్తుల సదస్సుకు శ్రీకారం చుట్టగా ఇప్పటివరకు 38 పూర్తయ్యాయి. చివరి సదస్సు 2016లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకుర్ నేతృత్వంలో జరిగింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ చొరవతో ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరగనున్న ఈ సదస్సులో ప్రధానంగా అయిదు అంశాలపై చర్చించనున్నారు. 1. దేశవ్యాప్తంగా అన్ని కోర్టు సముదాయాల్లో నెట్వర్క్, అనుసంధానతను బలోపేతం చేయడం, 2.జిల్లా కోర్టుల అవసరాలకు తగ్గట్టు మానవ వనరులు/సిబ్బందికి సంబంధించిన విధాన రూపకల్పన, 3. మౌలికవసతుల కల్పన, భవనాల సామర్థ్యం పెంపు, 4. సంస్థాగత, న్యాయపరమైన సంస్కరణల అమలు, 5. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు అన్న అంశాలు ఉన్నాయి.
కాగా, జిల్లా కోర్టుల్లో మౌలికవసతుల అభివృద్ధికోసం కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో స్పెషల్ పర్పస్ వెహికిల్గా జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీలను ఏర్పాటుచేయడంపైనా చర్చిస్తారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల కోసం సిఫార్సులను వేగవంతం చేయడంపైనా చర్చిస్తారు. దీనికి కొనసాగింపుగా శనివారం విజ్ఞాన్భవన్లో ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సమావేశం జరుగుతుంది. ఆ సదస్సును ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభిస్తారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/