పార్లమెంట్‌ నుంచి బహిష్కరణ..సుప్రీంకోర్టును ఆశ్రయించిన తృణమూల్ నేత మహువా

Mahua Moitra

న్యూఢిల్లీః తృణమూల్ పార్టీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంట్‌ నుంచి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె సోమవారం సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. తనను లోక్‌సభ నుంచి బహిష్కరించడాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలతో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా పై బహిష్కరణ వేటు పడిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్‌ గురించి పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు మహువా.. వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ నుంచి డబ్బులు , విలువైన బహుమతులు తీసుకుందంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే ఆరోపించారు. దీనిపై ఆయన లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

మరోవైపు ఈ కేసులో హీరానందానీ అప్రూవర్‌గా మారారు. ప్రశ్నలు అడిగేందుకు తాను ఎంపీ మహువా మొయిత్రాకు డబ్బులు ఇచ్చానని వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ ఆరోపించారు. కృష్ణా నగర్‌ ఎంపీ అయిన మహువా మొయిత్రా పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీని లక్ష్యంగా చేసుకొని ప్రధాని మోడీని దూషించి ఇబ్బంది పెట్టారని వెల్లడించారు. తాను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగేందుకు మొయిత్రా పార్లమెంట్‌ లాగిన్‌ ఉపయోగించానని అక్టోబర్‌ 19న తెలిపారు. ఈ ఆరోపణలపై లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ నవంబర్‌ 9న విచారణ జరిపి హీరానందానీ ఆరోపణలు నిజమేనని తేల్చింది. మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని ప్రతిపాదన చేస్తూ నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా లోక్‌సభ నుంచి మహువాను బహిష్కరిస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా శుక్రవారం ప్రకటించారు.