నేడు బీఆర్​ఎస్ విస్తృతస్థాయి సమావేశం

నేడు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఇరవై రోజుల వ్యవధిలో రెండోసారి భేటీ జరగనుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర అధికార యంత్రాంగం సిద్దమవుతుంది. జూన్‌ 2 నుంచి 21 రో జులపాటు రాష్ట్రమంతా వైభవోపేతంగా వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనున్నది.

ఈ కీలక భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు.. రాష్ట్ర కార్యవర్గం, కార్పొరేషన్ల ఛైర్మన్లు కూడా హాజరు కావాలని కేసీఆర్ తెలిపారు. గతనెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి.. జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇరవై రోజుల వ్యవధిలోనే కర్ణాటక ఫలితాలు వెలువడగానే మళ్లీ సమావేశం జరపడంపై రాజకీయ ఆసక్తి నెలకొంది.