పదో తరగతి ఫలితాల విడుదలలోనూ రాజకీయమా. .? – నారా లోకేష్
ఏపీలో వైస్సార్సీపీ పార్టీ ఫై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి సర్కార్ తీరుపై మండిపడ్డారు. పదో తరగతి ఫలితాల విడుదలలోనూ రాజకీయమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈరోజు ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలను ప్రకటిస్తామని తెలిపిన ఏపీ సర్కార్..కాసేపట్లో ఫలితాలు విడుదల అవుతాయని అంత అనుకుంటున్న సమయంలో ఫలితాలు సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. దీనిపై నారా లోకేష్ సర్కార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇంత దరిద్ర, అరాచక పాలన చరిత్రలో ఎప్పుడూ చూడలేదని , ఆఖరికి పదో తరగతి ఫలితాల విడుదలలోనూ రాజకీయమా? అని మండిపడ్డారు. మంత్రికి సమాచారం లేకుండా ఫలితాల వెల్లడి తేదీ ప్రకటించారని.. వాటిని అకస్మాత్తుగా వాయిదా వేస్తారా అని లోకేశ్ నిలదీశారు. పిల్లల భవిష్యత్తుతో వైస్సార్సీపీ ప్రభుత్వం ఆటలాడుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ తీరు.. తల్లిదండ్రులకు తీవ్ర మనోవేదన కలిగిస్తోందన్నారు. ఇంతకీ ఫలితాలు వాయిదా వేసింది.. మంత్రి అలిగారనా? అని లోకేశ్ నిలదీశారు. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. కోర్టు వాయిదాలకు అలవాటు పడ్డ సీఎం జగన్.. 10వ తరగతి పరీక్ష ఫలితాలు వాయిదా వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
పరీక్ష ఫలితాలను చివరి నిమిషంలో ఎందుకు వాయిదా వేశారో విద్యార్థులకు.. సీఎం, విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీ చేతకాని పాలనతో విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడుతారా అని అచ్చెన్న మండిపడ్డారు. ‘మద్యం వ్యాపారం చేసుకునే వ్యక్తిని.. విద్యాశాఖ మంత్రిని చేశారు. విజయనగరం జిల్లాలో ఉన్న తన వైన్ షాపుల సంఖ్య తప్పా.. రాష్ట్రంలోని పాఠశాలల సంఖ్య మంత్రి బొత్స సత్యనారాయణకు తెలుసా? అని ప్రశ్నించారు.