చంద్రబాబును జైల్లోనే చంపేందుకు కుట్రలు చేస్తున్నారుః అచ్చెన్నాయుడు

డాక్టర్లు తప్పుడు మెడికల్ రిపోర్టులు ఇస్తున్నారని మండిపాటు

atchannaidu

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్నా జైల్లో ఆయనకు సరైన వైద్యం అందించడం లేదని అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను జైల్లోనే చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. సరైన వైద్యం అందించకపోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయని చెప్పారు. చంద్రబాబుకు ఏమీ కాలేదని డాక్టర్లు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు బయటకు రాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోందని చెప్పారు. తన తండ్రి మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలని నారా లోకేశ్ కోరినా జైళ్ల శాఖ డీఐజీ ఇవ్వడం లేదని విమర్శించారు.

చంద్రబాబును అరెస్ట్ చేసి 38 రోజులు గడిచినా స్కిల్ కేసులో ఒక్క రూపాయి అవినీతి జరిగిందని నిరూపించలేకపోయరని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఆయనను అన్యాయంగా జైల్లో ఉంచుతున్నారని దుయ్యబట్టారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని… చంద్రబాబును ఎయిమ్స్ కు తరలించి చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై టిడిపి శ్రేణులే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారని చెప్పారు.