మానవాళి మొత్తానికి టెర్రరిజం శత్రువు..అమెరికన్ కాంగ్రెస్ లో భారత ప్రధాని ప్రసంగం

స్టాండింగ్ ఒవేషన్, చప్పట్లతో మార్మోగిన సభ

‘There can be no ifs or buts in dealing with terror,’ PM Modi tells US Congress

వాషింగ్టన్‌ః భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అమెరికా చట్ట సభలో కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా ప్రజా ప్రతినిధులు చప్పట్లతో మోడీకి స్వాగతం పలికారు. మోడీ.. మోడీ అన్న అరుపులతో సభ దద్దరిల్లిపోయింది. భారత సంప్రదాయం ప్రకారం సభికులకు చేతులు జోడించి నమస్కరిస్తూ మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఉగ్రవాదం.. మానవాళి మొత్తానికి శత్రువని, దీనిపై జరిపే పోరాటంలో ఎలాంటి ఉపేక్ష చూపబోమని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై భారత్ ఎలాంటి ఉపేక్ష చూపదని, టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ ప్రపంచ దేశాలపైకి వదిలే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోమని తేల్చిచెప్పారు.

అమెరికాలోని ట్విన్ టవర్స్ కూల్చివేత ఘటన (9/11), ముంబైలో దాడుల (26/11) ఘటనలను ప్రస్తావిస్తూ.. రాడికలిజం, టెర్రరిజం మొత్తం ప్రపంచానికి పెను ముప్పుగా మారాయని మోడీ పేర్కొన్నారు. అగ్రరాజ్యంలోని అత్యున్నత సభలో పాకిస్థాన్ ను పరోక్షంగా హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నా ఇప్పటికీ ప్రపంచానికి ముప్పు తొలగిపోలేదని మోడీ వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు లేచి నిలబడి చప్పట్లతో మోదీని అభినందించారు. కాగా, అమెరికన్ కాంగ్రెస్ లో ప్రధాని మోడీ ప్రసంగించడం ఇది రెండవసారి.