కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల మూడో విడుత పోలింగ్‌

The third free polling of the ongoing Lok Sabha elections

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల మూడో విడుత పోలింగ్‌ కొనసాగుతున్నది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద తమ అవకాశం కోసం ఓటర్లు బారులు తీరారు. ఈ విడుతలో 11 రాష్ట్రాల్లోని 93 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 17.24 కోట్ల మంది ఓట్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 1351 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 120 మందికిపైగా మహిళలు ఉన్నారు. మూడో విడతలో వాస్తవానికి 94 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా, సూరత్ సీటు బీజేపీకి ఏకగ్రీవమైంది. జమ్ముకశ్మీర్ రాజౌరీ-అనంత్ నాగ్ నియోజకవర్గంలో రవాణా సమస్యలతో పోలింగ్ తేదీని ఆరో విడతకు మార్చారు. మధ్యప్రదేశ్‌లో రెండో విడతలో జరగాల్సిన ఒక స్థానాన్ని ఈ విడతలో నిర్వహిసున్నారు. మూడో దశ తర్వాత మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గానూ 283 స్థానాలకు ఓటింగ్‌ పూర్తవుతుంది.

గుజరాత్‌లో ఇండోర్‌ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవం చేసుకోగా, తక్కిన 25 స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే మహారాష్ట్రలో 11, యూపీ 10, కర్ణాటక 14, మధ్యప్రదేశ్‌ 9, ఛత్తీస్‌గఢ్‌ 7, బీహార్‌ 5, అస్సాం, పశ్చిమబెంగాల్‌లో నాలుగు చొప్పున, గోవా 2, దాద్రా నగర్‌ హవేలీ, డామన్‌ డయ్యూలో ఒక్కో స్థానం చొప్పున స్థానాలకు ఈ దశలో పోలింగ్‌ జరుగనున్నది.

కాగా, కేంద్ర మంత్రులు అమిత్‌షా, జ్యోతిరాదిత్య సింధియా, మన్షుఖ్‌ మాండవీయ, పురుషోత్తం రూపాలా, ప్రహ్లాద్‌ జోషీతోపాటు అఖిలేశ్‌యాదవ్‌ సతీమణి డింపుల్‌ యాదవ్‌, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, దిగ్విజయ్‌ సింగ్‌, సుప్రియాసూలే తదితర ప్రముఖుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్దేశించనున్నారు.