తెలంగాణ వ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణి ప్రారంభం
తెలంగాణ వ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణి ప్రారంభమైంది. రాష్ట్రంలోని చెరువులన్నింటిలో చేప పిల్లలను విడుదల చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మత్స్యశాఖ అధికారులు చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే చేప పిల్లలను ప్రత్యేకంగా పెంచిన అధికారులు గుర్తించిన రిజర్వాయర్లు చెరువుల్లో వదిలేందుకు సిద్ధంగా ఉన్నారు. మొత్తం 26,778 నీటి వనరులలో రూ.68 కోట్ల చేప పిల్లలు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం గతంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు కురిశాయి. దీనివల్ల ప్రతి చెరువు, కుంట నిండు కుండల్లా మారింది. మరో రెండు నెలలు వర్షాలు కురియనున్నాయి. ఈ క్రమంలో చేప పిల్లలను వదిలేందుకు మార్గం సుగమమైంది.
రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచనతో జిల్లాల్లోనూ సోమవారం నుంచి చేప పిల్లల విడుదలను ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంఎల్సీలు, కలెక్టర్ల చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. చేప పిల్లల పంపిణీ పారదర్శకంగా జరిగేలా మత్స్యమిత్ర యాప్ను సైతం ప్రారంభించడం గమనార్హం. చేప పిల్లలతో బయలుదేరిన వాహనం ఎప్పుడు వెళ్లింది.. ఎన్ని చేప పిల్లలను విడుదల చేశారనే వివరాలు ఎప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి పర్యవేక్షిస్తారు. దీంతో చేప పిల్లల పంపిణీలో అవకతవకలు లేకుండా పథకం అమలు కానున్నది.