నేడు భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ చేయనున్న ప్రధాని
భీమవరంః మన్యం వీరుడు, విప్లవ నిప్పుకణిక అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోడీ.. నేడు భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం భీమవరానికి సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భీమవరం పట్టణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో తగు ఏర్పాట్లు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలను ముమ్మరం చేశారు.
భీమవరం ఏఎస్ఆర్ నగర్లో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. చుట్టూ ఫ్లెక్సీల్లో అల్లూరి చిత్రాలతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం జగన్మోహన్రెడ్డి, కేంద్రమంత్రి కిషన్రెడ్డి చిత్రాలను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంగణాన్ని ఆకట్టుకునే రీతిలో పుష్పవనంలా తీర్చిదిద్దారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/