ప్రధాని పర్యటన జాబితాలో నా పేరు లేదు.. మోడీకి రఘరామ లేఖ
జాబితాలో తన పేరు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందని ఫిర్యాదు
అమరావతిః ప్రధాని మోడీ భీమవరం పర్యటనలో నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు నిరాశే ఎదురైంది. ప్రధాని భీమవరం పర్యటన జాబితాలో ఎక్కడా తన పేరు లేకపోవడంతో ఆయన హైదరాబాద్లోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధానికి లేఖ రాశారు. పర్యటనకు రాలేకపోతున్నానని అందులో పేర్కొన్నారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధానిని స్థానిక ఎంపీ ఆహ్వానించాలని, కానీ ప్రధాని పర్యటన జాబితాలో తన పేరు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు.
ఆహ్వానం లేకపోవడంతో తాను పర్యటనలో పాల్గొనలేకపోతున్నట్టు రఘురామరాజు పేర్కొన్నారు. మరోవైపు, గత రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి భీమవరానికి బయలుదేరినప్పటికీ మధ్యలోనే రైలు దిగి వెనక్కి వెళ్లిపోయారు. భీమవరంలో తనకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన యువకులపై పోలీసులు కేసులు పెట్టిన విషయం తెలియడంతో మనస్తాపం చెందిన ఆయన మధ్యలోనే రైలు దిగి వెనక్కి వెళ్లినట్టు ఆయన కార్యాలయం తెలిపింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/