వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కి వార్నింగ్ ఇచ్చిన టాలీవుడ్

ఏపీలో సినిమా టికెట్స్ ధరలు తగ్గించడం పట్ల వైసీపీ సర్కార్ ఫై టాలీవుడ్ ఆగ్రహం గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి..చిత్రసీమ ఫై సంచలన వ్యాఖ్యలు చేయడం పట్ల ఇండస్ట్రీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోరు అదుపులో పెట్టుకోవాలని..అన్ని తెలుసుకొని మాట్లాడాలని హెచ్చరించింది.

సోమవారం కోవూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రసన్న కుమార్.. సినిమా వాళ్ల గురించి మాట్లాడారు. సినిమా వాళ్లంతా హైదరాబాద్‌లో ఉన్నారని, వారికి ఏపీ కనిపిస్తుందా? అని ప్రశ్నించారు. బలిసి కొట్టుకుంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యల పట్ల చిత్రసీమ ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేఖ విడుదల చేసింది.

‘‘కోవూరు శాసన సభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి.. ‘మన సినిమా నిర్మాతలను బలిసినవాళ్లు’ అని అనడం జరిగింది. ఇది చాలా బాధాకరం, నిజనిజాలు తెలియకుండా ఒక గౌరవ శాసన సభ్యులు ఈ విధంగా మాట్లాడటం, మొత్తం తెలుగు సినిమా పరిశ్రమను అవమానించినట్టుగా భావిస్తున్నాము. మన తెలుగు సినిమా సక్సెస్ రేటు సుమారుగా 2 నుండి 5% మాత్రమే. మిగిలిన సినిమాలు నష్టపోవడం జరుగుతుంది, చిత్రసీమలో ఉన్న 24 క్రాఫ్ట్స్ కు పని కల్పిస్తూ, అనేక ఇబ్బందులు పడి, కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీసిన నిర్మాతలు, చివరకు ఆస్తులు అమ్ముకోవడం జరుగుతుంది. ఈ కష్ట, నష్టాల, బారిన పడి కొంతమంది నిర్మాతలు చలన చిత్ర నిర్మాతల మండలి నుండి నెలకు 3000/- రూపాయలు పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీనిని బట్టి చలన చిత్ర నిర్మాతలు ఎటువంటి దారుణ పరిస్థితులలో ఉన్నారనే సంగతి తేటతెల్లమవుతుంది. ప్రసన్న కుమార్ రెడ్డిగారు నిర్మాతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తూ.. వారి వ్యాఖలను ఉపసంహరించుకోవాలని కోరుచున్నాము..’’ అని పేర్కొన్నారు.