రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీపై చర్చ..!

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రేపు కేబినెట్ భేటీ జరగనుంది. రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రాష్ట్ర ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై మంత్రి వర్గం చర్చించనున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, ఏపీతో ఉన్న సమస్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై క్యాబినెట్ లో చర్చించనున్నారు.

కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ ల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది. నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యచరణ పై ఈ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. జూన్ నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్కూల్, కళాశాలలు ప్రారంభం కాకముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ అంశాలపై నివేదిక తయారుచేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది.