కెసిఆర్ కు అధికారం కోల్పోతామనే భయం పట్టుకుందిః తరుణ్ ఛుగ్

త్వరలోనే తెలంగాణకు కెసిఆర్ పాపాల నుంచి విముక్తి లభిస్తుందని వ్యాఖ్య

tarun-chugh-fires-on-kcr

హైదరాబాద్ః ఈ నెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని బిజెపి తెలంగాణ ఇన్చార్జి తరుణ్ ఛుగ్ చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు బిజెపిదే ఆయన ధీమా వ్యక్తం 21న సాయంత్రం 4 గంటలకు మునుగోడులో భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ఆ సభలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరుతారని చెప్పారు. ఇతర పార్టీలకు చెందిన చాలా మంది నేతలు బిజెపి లో చేరబోతున్నారని తెలిపారు. రేపు 4 గంటలకు కోరుట్లలో బిజెపి లోకి పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయని చెప్పారు.

త్వరలోనే తెలంగాణకు కెసిఆర్ పాపాల నుంచి విముక్తి లభిస్తుందని తరుణ్ ఛుగ్ అన్నారు. అవినీతి, వంశపారంపర్య రాజకీయాలే తెలంగాణకు శాపమని వ్యాఖ్యానించారు. బ్రిటీష్ వాళ్లు, ఇందిరాగాంధీ మాదిరే కెసిఆర్ పాలన కూడా ఉందని విమర్శించారు. ప్రధాని మోడీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పసలేదంటూ కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ… కెసిఆర్ ప్రసంగాలపై స్పందించడం అనవసరమని అన్నారు. కెసిఆర్ కు భారత రాజ్యాంగంపై నమ్మకం లేదని… సొంత రాజ్యాంగాన్ని రచించాలనుకుంటున్నారని మండిపడ్డారు. అధికారాన్ని కోల్పోతామనే భయం కెసిఆర్ కు పట్టుకుందని… అందుకే బిజెపిని చూసి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ పాదయాత్రపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని చెప్పారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/