మా నౌక ఏ దేశ భద్రతకూ విఘాతం కలిగించదుః చైనా

ఇది కేవలం రీసర్చ్ వెహికల్ మాత్రమే అన్న చైనా
అవసరమైన వాటిని నింపుకోవడానికి నౌకకు కొంత సమయం పడుతుందన్న చైనా

china-says-its-ship-docking-at-lanka-port-does not-affect-any-country

కోలంబోః చైనాకు చెందిన గూఢచార నౌక యువాన్ వాంగ్ 5 శ్రీలంకలోని హంబన్ టోటా పోర్టులో మకాం వేసిన సంగతి తెలిసిందే. భారత్ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ అది శ్రీలంకకు చేరుకుంది. భారత్ ప్రయోగించే మిసైళ్లను ట్రాక్ చేయడమే కాక, మహాసముద్రాలను కూడా ఈ నౌక సర్వే చేస్తుంది. అంతేకాదు జలాంతర్గాములకు తన వంతు సేవలను అందిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఈ నౌక స్పై షిప్ కాదని… రీసర్చ్ వెహికల్ మాత్రమేనని చైనా అంటోంది. తమ హైటెక్ రీసర్చ్ వెస్సెల్ వల్ల ఏ దేశ భద్రతకూ విఘాతం కలగదని చెపుతోంది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ… శ్రీలంక సహకారంతో హంబన్ టోటా పోర్టులో యువాన్ వాంగ్ 5 బెర్త్ అయిందని చెప్పారు. హంబన్ టోటా పోర్టులో తమ నౌకకు శ్రీలంకలోని చైనా రాయబారి స్వాగతం పలికారని తెలిపారు. శ్రీలంకకు ఇచ్చిన అప్పులను జమ చేసుకునే ప్రక్రియలో ఈ పోర్టును చైనా 99 ఏళ్లకు లీజుకు తీసుకున్న సంగతి తెలిసిందే. 2017లో పోర్టును స్వాధీనం చేసుకుంది.

మరోవైపు, అంతర్జాతీయ చట్టాలకు, నిబంధనలకు లోబడే యువాన్ వాంగ్ 5 నౌక మెరైన్ సైంటిఫిక్ రీసర్చ్ చేస్తుందని వాంగ్ వెన్బిన్ తెలిపారు. ఏ దేశ భద్రతను కానీ, ఆర్థిక కార్యకలాపాలకు కానీ విఘాతం కలిగించదని చెప్పారు. హంబన్ టోటా పోర్టులో అవసరమైన వాటిని నింపుకోవడానికి ఈ నౌకకు కొంత సమయం పడుతుందని తెలిపారు. తమ దేశానికి ఈ నౌకను పంపడాన్ని వాయిదా వేసుకోవాలని శ్రీలంక చెప్పింది కదా అనే ప్రశ్నకు సమాధానంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్తల్లో నిజం లేదని అన్నారు. శ్రీలంక అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడానికి, ఆ దేశంపై ఒత్తిడి తెచ్చేందుకు కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని పరోక్షంగా భారత్ పై విమర్శలు గుప్పించారు.

మరోవైపు చైనా మీడియా కథనాల ప్రకారం ఈ నౌకలో 2 వేల మంది సిబ్బంది పని చేస్తుంటారు. శాటిలైట్లను, ఖండాతర క్షిపణులను ఇది తనలో ఉన్న ఆధునిక వ్యవస్థలతో ట్రాక్ చేస్తుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/