నందిగామ రాళ్ల దాడిపై టీడీపీ అధిష్టానం సీరియస్

నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు వాహనంపై రాళ్ళ దాడి వ్యహారాన్ని పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నందిగామ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వాహనంపై విజయవాడ ఎంపీ కేశినేని నానితో కలిసి జనాలకు అభివాదం చేసుకుంటూ చంద్రబాబు ముందుకు సాగారు. ఈ సమయంలో చంద్రబాబు వెనకాలే నిలుచున్న మధుపై ఒక్కసారిగా రాయి పడింది. ఎటు వైపు నుంచి వచ్చిందో తెలియదు గానీ… మధుకు గాయాలను చేసింది.

చంద్రబాబుకు కేంద్రం జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సెక్యూరిటీ బృందానికి నేతృత్వం వహిస్తున్న మధుపైనే రాయి పడటం గమనార్హం. తనకు దెబ్బ తగలి రక్తం కారుతుండటంతో విషయాన్ని ఆయన చంద్రబాబుకు తెలిపారు. మధుకు గాయం కావడం, ఆయన తల నుంచి రక్తం కారుతున్న దృశ్యాలను చూసిన వెంటనే కోపోద్రిక్తుడైన చంద్రబాబు… నాని చేతిలోని మైకును తీసుకుని తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. తన రోడ్ షోకు పోలీసులు సరైన భద్రత కల్పించలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అంతు చూసే వరకు నిద్ర పోనంటూ చంద్రబాబు హెచ్చరించారు.

రాళ్ళ దాడి వ్యహారాన్ని పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. రాళ్ళ దాడి వ్యహారంలో ఎవరూ సూత్రధారులు, పాత్రధారులు అనే కోణంలో వివరాలు సేకరించే పనిలో పడింది. మరోవైపు పోలీసులు కూడా ఈ ఘటనపై సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. నందిగామ సీఎం రోడ్డులో ప్రభుత్వ పాఠశాల, రైతు బజార్ మధ్య రాళ్ళ దాడి జరిగివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో సి.సి టి.వి ఫూట్ఏజ్‌ను సేకరిస్తున్నారు. రాళ్ళ దాడి ఘటనపై నందిగామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసే ఆలోచనలో స్థానిక టీడీపీ నేతలు ఉన్నట్లు సమాచారం.