తప్పుడు కేసులకు బెదరబోనుః పట్టాభిరామ్

సెంట్రల్ జైలు నుంచి టిడిపి నేత పట్టాభి విడుదల

tdp-leader-pattabhi-ram-gets-bail

అమరావతిః రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి టిడిపి నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విడుదలయ్యారు. ఈ క్రమంలో పట్టాభికి టిడిపి నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. నిన్న జిల్లా కోర్టు ఆయనకు రూ.25 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

కాగా.. జైలు నుంచి విడుదలైన సందర్భంగా పట్టాభి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం పెట్టే తప్పుడు కేసులకు భయపడి లొంగిపోయేది లేదని స్పష్టం చేశారు. గన్నవరంలో ఏం జరిగిందో అందరూ చూశారని వ్యాఖ్యానించారు. తెలుగు దేశం పార్టీ బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని చెప్పారు.

పోలీస్ స్టేషన్‌లోనే దుండగులతో తనపై దాడి చేయించిన తీరును ప్రజలందరూ చూశారన్నారు. ఎన్ని దాడులు జరిగినా తాను వెనకడుగు వేసేదే లేదని తేల్చి చెప్పారు. టిడిపి నేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అడుగు ముందుకు వేస్తామని చెప్పారు. కష్టసమయంలో తనకు, తన కుటుంబసభ్యులకు అండగా నిలిచిన టిడిపి అధినేత చంద్రబాబుతో పాటూ ఇతర నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.