మొయినాబాద్ వ్యవహారంలో ముగ్గురిపై కేసులు నమోదు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు నిందితులపై కేసు నమోదైంది. ఫరీదాబాద్ కు చెందిన రామచంద్రభారతి, తిరుపతికి చెందిన వెంకటనాథ సింహయాజి, హైదరాబాద్ కు చెందిన వ్యాపారి నందకుమార్ అనే వ్యక్తులపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో మొయినాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బీజేపీలో చేరాలని తనపై ముగ్గురు ఒత్తిడి తెచ్చారని, డీలింగ్ లో భాగంగానే వాళ్లు తన ఫామ్ హౌస్ కు వచ్చారని పోలీసులకు ఫిర్యాదు చేసారు రోహిత్. కేసులు నమోదైన ముగ్గురిని రాజేంద్రనగర్ లోని ఉప్పర్ పల్లి మెట్రోపాలిటన్ కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు.

మునుగోడు ఉప ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో పెనుప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను రూ.400 కోట్లతో కొనుగోలు చేసేందుకు కొందరు చేసిన యత్నాన్ని సైబరాబాద్‌ పోలీసులు భగ్నం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన మధ్యవర్తులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అంతేకాదు.. దాదాపు గంటన్నరపాటు సాగిన బేరసారాలను రహస్యంగా ఆడియో, వీడియో రికార్డింగ్‌ కూడా చేశారు.