‘జెండా’ సభ గ్రాండ్ సక్సెస్..టీడీపీ- జనసేన శ్రేణుల్లో జోష్

తాడేపల్లెగూడెం లో ఏర్పాటు చేసిన జనసేన – టీడీపీ ఉమ్మడి ‘జెండా’ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ సభ కు ఏపీ రాష్ట్ర ప్రజలే కాదు ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు తమ్ముళ్లు, జనసేన అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సక్సెస్ చేసారు. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు సైతం తమదైన ప్రసంగాలతో కార్యకర్తల్లో జోష్ నింపారు.

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసమే టీడీపీ-జనసేన పార్టీలు కలిశాయని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగన్ పార్టీని ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ఇంకా ఎలా దోచుకోవాలో జగన్‌ వద్ద స్కెచ్‌ ఉందని, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తమ వద్ద బ్లూప్రింట్‌ ఉందని తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలు మాతో చేతులు కలపాలని, 2029కి విజన్‌ డాక్యుమెంట్‌ తయారు చేశామని, హైదరాబాద్‌ కంటే మిన్నగా రాజధాని ఉండాలని అమరావతికి రూపకల్పన చేశామని తెలిపారు. ఏ సీఎం అయినా అభివృద్ధి పనులతో పాలన సాగిస్తారని, జగన్‌ సీఎం అయ్యాక అరాచకాలతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని జగన్‌ అపహాస్యం చేశారు. పెట్టుబడులు తెచ్చి రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని, దోచుకున్న డబ్బులతో జగన్‌ మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారని అన్నారు. కావున వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకమని, వైసీపీ దొంగలపై టీడీపీ-జనసేన పోరాడలని సూచించారు.