నేడు ఏపి రానున్న ఎన్డీయే రాష్రపతి అభ్యర్థి ముర్ము

వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటి

nda-presidential-candidate-Draupadi-Murmu-ap-tour

అమరావతిః ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము నేడు ఏపికి రానున్నారు. ఈ సందర్భంగా ఆమె ఈరోజు వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. మంగళగిరిలోని ఒక ఫంక్షన్‌హాల్‌లో మధ్యాహ్నం గంటపాటు ఈ సమావేశం జరగనుంది. సమావేశానంతరం ఆమెకు ముఖ్యమంత్రి జగన్‌ మర్యాదపూర్వకంగా తన నివాసంలో తేనీటి విందు ఇవ్వనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీయే అభ్యర్థి ముర్ముకు వైఎస్‌ఆర్‌సిపి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

మంగళవారం మధ్యాహ్నం 2:45 గంటలకు ఆమె గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడినుంచి మంగళగిరిలోని ఫంక్షన్‌హాల్‌కు వెళతారు. అక్కడ ముఖ్యమంత్రి జగన్‌ ఆమెకు స్వాగతం పలకనున్నారు. అక్కడే వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరినీ ఆమెకు సీఎం పరిచయం చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె రాష్ట్రానికి వస్తున్నారని వైకాపా వర్గాలు తెలిపాయి. ముర్ము వెంట కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఉంటారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లనున్నారు. అక్కడ ఆమెకు ముఖ్యమంత్రి తేనీటి విందునివ్వనున్నారు. అనంతరం ఆమె బయల్దేరి వెళ్లనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః