ఐదేళ్ల పదవీ కాలాన్ని దోపిడీ కోసం వెచ్చించారుః చంద్రబాబు

chandrababu

అమరావతిః గత ఎన్నికల హామీలను తుంగలో తొక్కి మరోసారి ప్రజలను మోసం చేసేందుకు జగన్ బస్సు యాత్ర చేపడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇంతకుముందు ఇచ్చిన హామీలపై బదులిచ్చాకే బస్సు ఎక్కాలంటూ జగన్ కు సవాల్ విసిరారు. 99 శాతం హామీలను అమలు చేశామని అధికార పార్టీ నేతలు చెప్పుకుంటున్నారని, వాస్తవంలో మాత్రం 99 హామీలపై ప్రజలను జగన్ ఏమార్చారని చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ‘హామీల అమలు ఓ బూటకం.. విశ్వసనీయతపై జగన్ కబుర్లు అతిపెద్ద నాటకం’ అంటూ గురువారం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఐదేళ్ల పదవీకాలాన్ని విధ్వంసాలకు, దోపిడీకి, కక్షా రాజకీయాలకు వెచ్చించారని జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.

జగన్ ఇచ్చిన 99 హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదంటూ నారా లోకేశ్ చేసిన వీడియో ట్వీట్ ను చంద్రబాబు రీట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో జగన్ పై లోకేశ్ విమర్శలు గుప్పించారు. గత శాసన సభ, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో జగన్ ఇచ్చిన హామీలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ ను పొందుపరిచారు. ‘జగన్ రెడ్డి 99 మోసాలు.. ఏమార్చిన 99 హామీలు’ అంటూ లోకేశ్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీనికి ‘హామీలు నెరవేర్చి ఓట్లు అడగడానికి వస్తా అన్నావ్.. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తావ్ జగన్. అయినా పరదాలు ఉండగా నీకేంటి సిగ్గు!’ అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు.