సుప్రీంకోర్టుకు క్షమాపణలు తెలిపిన పతంజలి కంపెనీ
న్యూఢిల్లీ: పతంజలి ఆయుర్వేద ఎండీ ఆచార్య బాలకృష్ణ ఈరోజు సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు. తమ కంపెనీకి చెందిన ఉత్పత్తులపై వచ్చిన వాణిజ్య ప్రకటనల కేసులో ఆయన సారీ తెలిపారు. తప్పుడు యాడ్స్ ఇస్తున్నారని పతంజలి సంస్థకు రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ ఆషానుద్దిన్ అమనుల్లా ఆ కేసును వాదించారు. ఏప్రిల్ 2వ తేదీన కోర్టు ముందు హాజరుకావాలని బాలకృష్ణకు ఆదేశాలు జారీ చేశారు. అయితే కోర్టు ఆదేశాల పట్ల తనకు ఎనలేని గౌరవం ఉందని, తమ ఉల్లంఘనల పట్ల క్షమాపణలు చెబుతున్నట్లు అఫిడవిట్లో బాలకృష్ణ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి యాడ్స్ రాకుండా తమ కంపెనీ జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు.