కరీంనగర్ లో టీడీపీ ఆవిర్భావ సభ..?

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ టీడీపీ తన ఉనికిని చాటుకునేందుకు ట్రై చేస్తుంది. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో టీడీపీ అనేది లేకుండా పోయింది. చంద్రబాబు సైతం ఏపీ పైనే ఫోకస్ పెట్టారు. అసలు టీడీపీ లో నేతలే లేకుండా పోయారు. ఈ క్రమంలో మళ్లీ తెలంగాణ లో టీడీపీ మళ్లీ తన ఉనికిని చాటేందుకు చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మధ్యనే తెలంగాణ టీడీపీ బాధ్యత కాసాని జ్ఞానేశ్వర్ రెడ్డి చేతిలో పెట్టారు. టిడిపి తెలంగాణ అధ్యక్షుడిగా ఆయన్ను నియమించారు. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ సభ నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది.

టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న కరీంనగర్‌లో భారీ సభను నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు జిల్లా నాయకులు కరీంనగర్‌లోని ఎస్సారార్‌ కళాశాల మైదానంతో పాటు అంబేడ్కర్‌ మైదానాన్ని పరిశీలించారు. మొదట సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో ఆవిర్భావదిన వేడుకలతో పాటు భారీ బహిరంగ సభను నిర్వహించాలని పార్టీ భావించి దీనికి రాష్ట్రవ్యాప్తంగా జనసమీకరణ చేపట్టాలని నిర్ణయించింది. కానీ కంటోన్మెంట్‌ ఎన్నికలకు ఈ నెలలోనే నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో కరీంనగర్‌లో సభ నిర్వహించాలనే ఉద్దేశంతో ఇక్కడి మైదానాలను పరిశీలించారు. ఈ సభకు పార్టీ అధినేత చంద్రబాబు హాజరవుతారని నాయకులు అంటున్నారు. సభ ఎక్కడ నిర్వహిస్తారనే విషయం మరో రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.