విషమంగా తారకరత్న ఆరోగ్యం

తారకరత్న ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ చెపుతున్నారు. శుక్రవారం నారా లోకేష్ పాదయాత్ర లో పాల్గొన్న తారకరత్న ..కాసేపటికే నడుచుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కార్య కర్తలు హాస్పటల్ కు తరలించారు. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ (నారాయణ హృదయాలయ) లో చికిత్స అందిస్తున్నారు. తాజాగా తారకరత్న హెల్త్ కు సంబదించిన అప్డేట్ ను హాస్పటల్ బృందం విడుదల చేసారు.

బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని, తారకరత్నకు ప్రస్తుతం ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస కొనసాగుతోందని డాక్టర్స్ తెలిపారు. తారకరత్నకు ఐసీయూలో ఎక్మోపై చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆయన ఆరోగ్యాన్ని 10 మంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో.. అభిమానుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. ఆయన కోలుకోవాలని టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు. తారకరత్న త్వరగా కోలుకుని తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు.

తారకరత్నతో పాటు బాలయ్య బెంగళూరులోనే ఉన్నారు. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి కూడా హాస్పిటల్‌లోనే ఉండి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సాయంత్రానికి బెంగళూరుకు చేరుకోనున్నారు. చంద్రబాబు వెంట నందమూరి, నారా ఫ్యామిలీ కూడా బెంగళూరుకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు బాలయ్యను అడిగి చంద్రబాబు తెలుసుకుంటున్నారు. మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కూడా తారకరత్న ఆరోగ్యంపై బాలయ్యను అడిగి ఆరా తీశారు.