తారకరత్న అంత్యక్రియలు పూర్తి

నందమూరి తారకరత్న అంత్యక్రియలు మహాప్రస్థానం లో పూర్తి అయ్యాయి. గత నెలలో గుండెపోటుకు గురైన తారకరత్న ..చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. సోమవారం ఆయన పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ లో ఉంచారు. మధ్యాహ్నం ఫిలిం ఛాంబర్ నుండి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర కొనసాగింది. ఈ అంతిమయాత్ర లో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు పాల్గొన్నారు.

బాలకృష్ణ తో పాటు కుటుంబ సభ్యులు పాడెమోశారు. అంతిమసంస్కారాల్లో విజయసాయి కూడా పాల్గొన్నారు. ఉదయం మోకిలాలోని నివాసం నుంచి చాంబర్‌కు భౌతికకాయాన్ని తరలించేప్పుడు పూర్తి చేయాల్సిన కార్యక్రమాల్ని తారకరత్న కుమారుడి ద్వారా చేయించారు. చాంబర్‌ నుంచి మహాప్రస్థానానికి తీసుకువెళ్తున్నప్పుడు మిగతా కార్యక్రమాల్ని ఆయన తండ్రి మోహనకృష్ణ శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.

తారకరత్న చితికి మోహనకృష్ణ నిప్పుపెట్టారు. చివరిసారి తారకరత్న నుదిటిపై తండ్రి మోహనకృష్ణ ముద్దుపెట్టి కన్నీరుమున్నీరయ్యారు. కాగా తారకరత్న పాడెను చిన్నాన్న రామకృష్ణ , బాలకృష్ణ, ఇతర బంధువులు మోసి రుణం తీర్చుకున్నారు. భారమైన హృదయాలతో తారకరత్నను చంద్రబాబు, ఎంపీ విజయసాయి, బాలకృష్ణ, టీడీపీ నేత అచ్చెన్నాయుడు, కుటుంబసభ్యులు, అభిమానులు సాగనంపారు.