గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి

గన్నవరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ ఫై దాడి చేసారు. టీడీపీ నేతలు వంశీ ఫై విమర్శలు చేయడం తో వంశీ అనుచరులు టీడీపీ ఆఫీస్ ఫై దాడి చేసారు. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఆఫీస్ ఆవరణలో ఉన్న వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. కత్తులతో టీడీపీ ఫ్లెక్సీలను వైస్సార్సీపీ కార్యకర్తలు చించివేశారు. ఓ కారు అద్దాలను ఇటుకలతో బద్దలు కొట్టారు. పార్టీలో కార్యాలయంలో కలియతిరుగుతూ విధ్యంసం సృష్టించారు.

పోలీసులు చూస్తుండగానే వైస్సార్సీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని , ఈ విషయంపై పోలీసులను అడిగితే సమాధానం చెప్పేందుకు నిరాకరించారని , పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని టీడీపీ నేతలు అంటున్నారు. టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడి చేసి విధ్వంసం సృష్టించడంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే వంశీ కనుసన్నల్లోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. వైస్సార్సీపీ రౌడీ మూకలు దాడి చేస్తుంటే పోలీసులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి రౌడీ పాలనకు పరాకాష్ఠ అని అచ్చెన్నాయుడు విమర్శించారు.