తమిళనాడు లో ఘోరం : కల్తీసారా తాగి 12 మంది మృతి

తమిళనాడులోని విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాల్లో విషాదం చోటుచేసుకుంది. కల్తీసారా తాగి ఏకంగా 12 మంది మృతి చెందారు. విల్లుపురం జిల్లా మరక్కాణం ప్రాంతానికి చెందిన అమరన్‌ సముద్ర తీరంలో ఉన్న వంబామేడు ప్రాంతంలో సారా విక్రయిస్తుంటాడు. అతడి వద్ద ఎక్కియార్‌కుప్పం జాలరి గ్రామానికి చెందిన కొందరు ఆదివారం సారాయి తాగారు. వారిలో చాలా మంది ఇంటికి వెళ్లిన వెంటనే స్పృహ కోల్పోయారు. వెంటనే కుటుంబ సభ్యులు వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది చికిత్స పొందుతున్నారు.

ఈ దుర్ఘటన పట్ల తీవ్ర సంతాపం ప్రకటించిన సీఎం స్టాలిన్ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికీ రూ.50 వేల చొప్పున సాయాన్ని అందించనున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరక్కాణం పోలీస్ స్టేషన్‌, ఎక్సైజ్ పోలీసుస్టేషనులో పనిచేస్తున్న ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేశారు.