మడకశిర తహసీల్దారుఫై వేటు

శ్రీసత్యసాయి జిల్లా మడకశిర తహసీల్దారు ..లంచం తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని…ఆనాటి రాముడి కాలం నుండి ఇది కొనసాగుతుందని..రైతులు మాకు లంచాలు ఇవ్వాల్సిందే..అని ఇస్తేనే పని అవుతుందని ఓ రైతుతో వాదించిన వీడియో సోషల్ మీడియా లో సంచలనంగా మారింది. వీఆర్వో లంచం కోసం పీడిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన రైతుతో తహసీల్దార్ ముర్షావలీ ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ వీడియో ఉన్నత అధికారులవరకు వెళ్లడం తో ఆయనపై వేటు వేశారు.

ఆ వీడియో లో సదరు తహసీల్దార్ ముర్షావలీ ఏమన్నారంటే..‘‘ఏ ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి ఉన్నా అంతే.. 2 నెలల కిందట నేను వచ్చిన కొత్తలో ఓ మంత్రి ఇక్కడకు వస్తే నలుగురు వీఆర్వోలు రూ.1.75 లక్షలు ఖర్చుచేశారు. ఒక్క రూపాయీ రాలేదు. ఇటీవల రాష్ట్రస్థాయి మహిళా అధికారి ఒకరు వచ్చారు. ఆ అమ్మ ఒక టెర్రరట. బెడ్‌రూంలోకి ఈగ కూడా రాకూడదట. ఆమె తినడానికి భారీ మెనూ ఇచ్చారు. దానిని చూస్తే భయపడిపోతారు. అవి మడకశిరలో దొరకవు. హిందూపురం నుంచి తెప్పించాలి. పాన్ కేక్ బెంగళూరులో దొరుకుతుంది. ఈ మెనూ ఖర్చు తహసీల్దారు భరిస్తాడా? అంతా వీఆర్వోలతోనే తెప్పిస్తాం? వీటికి మీ దగ్గర తీసుకున్న డబ్బే ఇస్తాం. లేకపోతే మా జీతాల్లోంచి ఖర్చు చేయాలా? అని ప్రశ్నించారు. ఒంటిపై ఉన్న కొన్ని పుళ్లను డాక్టర్‌కు మాత్రమే చూపించుకోగలమని కూడా చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు తహసీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.