రేవంత్ ఇంటికి చేరిన సస్పెండ్ అయిన ఆర్టీసీ ఉద్యోగులు

Suspended RTC employees who reached CM Revanth’s house

హైదరాబాద్‌ః ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద గతంలో సస్పెండ్ అయిన ఆర్టీసీ ఉద్యోగులు బారులు తీరారు. సీఎను కలిసేందుకు వారంతా పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు తరలివచ్చారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసం వద్దకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని వాపోయారు. చిన్న చిన్న కారణాలతో గత సర్కార్ తమను ఉద్యోగాల్లో నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడును సీఎంకు విన్నవించుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి తమను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గత ప్రభుత్వం తొలగించిన దాదాపు 1500 మంది ఉద్యోగులు సీఎం ఇంటి వద్దకు తరలిరాగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారి గోడు విన్న అధికారులు ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ముగ్గురికి అనుమతి ఇచ్చారు. సస్పెండ్‌, మెమో, జీతాలు కట్ చేయడం ఇలా చిన్న చిన్న కారణాలతో 15 వందల మందిని ఉద్యోగాల నుంచి తీసివేశారని సీఎంను కలిసి వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు.