కరెంట్ షాక్ తో మృతి చెందిన అభిమానుల కుటుంబాలను ఫోన్లో పరామర్శించిన హీరో సూర్య

నిన్న తమిళ్ హీరో సూర్య బర్త్ డే (జులై 23). ఈ సందర్బంగా పల్నాడు జిల్లా నర్సరావుపేట మోపువారిపాలెంకు చెందిన ఇద్దరు అభిమానులు..సూర్య కు విషెష్ చెపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కు గురై ఇద్దరు సాయి, నక్కా వెంకటేష్ అక్కడిక్కక్కడే మరణించారు.

డిగ్రీ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మోపువారిపాలెంలో సూర్య బర్త్ డే బ్యానర్స్ కడుతున్న సమయంలో కరెంట్ షాక్‏కు గురయ్యారు. ఈ ప్రమాదంలో పోలూరు సాయి, నక్కా వెంకటేష్ అక్కడిక్కక్కడే మరణించగా.. మరో అభిమాని తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇద్దరు విద్యార్థులు మరణించడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇక ఈ విషయం తెలుసుకున్న హీరో సూర్య బాధిత కుటుంబాలకు ఫోన్ చేసి పరామర్శించారు. తన పుట్టినరోజు వేడుకలలో ఇలా జరగడం తనకు బాధ కలిగించిందన్నారు. అలాగే ఆ కుటుంబాలకు తాను ఎప్పటికీ తోడుగా ఉంటానని మాటిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. చనిపోయిన ఇద్దరు యువకులు అటు ఎన్టీఆర్ అభిమానులు కూడా. తన ఫ్యాన్స్ మరణ వార్త తెలుసుకుని వెంటనే వారి కుటుంబాలకు భరోసా కల్పించిన సూర్యకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.