వివేకా హత్య కేసు.. పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఇరువర్గాలు తమ వాదనలను హైకోర్టు ఎదుట చెప్పుకోవాలని సూచన

supreme-court-dismissed-pa-krishna-reddy-petition

న్యూఢిల్లీః మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను బాధితుడిగా పరిగణించాలంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్ ను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సవాల్ చేసే అధికారం తనకూ ఉన్నట్లు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. అయితే సుప్రీంకోర్టు దీనిని తోసిపుచ్చింది. ఈ కేసులో జోక్యానికి సిద్ధంగాలేమని వెల్లడించింది.

ఇరువర్గాలు తమ వాదనలను హైకోర్టు ఎదుట చెప్పుకోవాలని సూచించింది. దీనిపై తమ అభిప్రాయాలతో సంబంధం లేకుండా హైకోర్టు స్వతంత్రంగా తగిన నిర్ణయం తీసుకోవచ్చునని స్పష్టం చేసింది. రేపు దీనికి సంబంధించి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది.