నందిగామ లో చంద్రబాబు ర్యాలీ ఫై రాళ్ల దాడి

టీడీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నందిగామ లో చేపట్టిన రోడ్ షోలో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. ఆ రాయి చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుకు తగలడం తో గాయాలయ్యాయి. ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయి విసిరిన సమయంలో విద్యుత్ సరఫరా నిలివేశారు. వైస్సార్సీపీ రౌడీలకు భయపడేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

అంతకుముందు చంద్రబాబు రోడ్‌షోలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రోడ్‌షో తొందరగా ముగించాలంటూ టీడీపీ నేతలపై పోలీసుల ఒత్తిడి తెచ్చారు. రోడ్‌షోకు భారీగా జనం తరలిరావడంతో అదనపు పోలీస్‌ బలగాలు రంగంలోకి దిగాయి. చంద్రబాబు వాహనానికి ముందు, వెనుకా పెద్దఎత్తున రోప్ పార్టీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు వాహనం చుట్టూ అదనపు భద్రతా బలగాలు ఏర్పాటు చేశారు.

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నందిగామ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వాహనంపై విజయవాడ ఎంపీ కేశినేని నానితో కలిసి జనాలకు అభివాదం చేసుకుంటూ చంద్రబాబు ముందుకు సాగారు.

ఈ సమయంలో చంద్రబాబు వెనకాలే నిలుచున్న మధుపై ఒక్కసారిగా రాయి పడింది. ఎటు వైపు నుంచి వచ్చిందో తెలియదు గానీ… మధుకు గాయాలను చేసింది. చంద్రబాబుకు కేంద్రం జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సెక్యూరిటీ బృందానికి నేతృత్వం వహిస్తున్న మధుపైనే రాయి పడటం గమనార్హం. తనకు దెబ్బ తగలి రక్తం కారుతుండటంతో విషయాన్ని ఆయన చంద్రబాబుకు తెలిపారు.

మధుకు గాయం కావడం, ఆయన తల నుంచి రక్తం కారుతున్న దృశ్యాలను చూసిన వెంటనే కోపోద్రిక్తుడైన చంద్రబాబు… నాని చేతిలోని మైకును తీసుకుని తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. తన రోడ్ షోకు పోలీసులు సరైన భద్రత కల్పించలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అంతు చూసే వరకు నిద్ర పోనంటూ చంద్రబాబు హెచ్చరించారు.