శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు

శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఓ భ‌క్తురాలి ప‌ట్ల అనుచితంగా ప్రవర్తించి వార్తల్లో నిలిచారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో ర‌చ్చ చేస్తున్నాయి. బ‌ల‌వంతంగా పోలీస్ జీప్ ఎక్కించారు. రాత్రి 10 అవుతున్నా హోటల్ ఎందుకు తెరిచి ఉంచారని, నీ భర్త ఆచూకీ చెప్పాలని ధనలక్ష్మి అనే మహిళను గత రాత్రి విచక్షణా రహితంగా కొట్టి, పోలీస్ స్టేషన్ కు తరలించారు సీఐ.. తన ఆరోగ్యం భాగోలేదని.. ఆపరేషన్‌ అయ్యిందంటూ ఆ మహిళ మొరపెట్టుకున్నా కనికరించకుండా విరుచుకుపడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నడి రోడ్డుపై మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించి, చీర ఊడిపోయేలా కొట్టి, బలవంతంగా పోలీస్ జీప్ ఎక్కించిన దృశ్యాలను స్థానికులు మొబైల్ ఫోన్లో చిత్రీకరించడంలో సీఐ అంజూ యాదవ్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. తనను కొట్టవద్దని ధనలక్ష్మి ఏడుస్తూ బతిమలాడిన కూడా కనికరం చూపకుండా దాడికి పాల్పడింది. ప్రస్తుతం బాధితురాలు రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. గతంలో 20వేల లంచం అడిగిందని ఇవ్వకపోవడంతో తమపై కక్షగట్టిందని బాధితురాలి భర్త హరినాయుడు అన్నారు. తన భార్యకు ఇటీవలే పెద్ద ఆపరేషన్ జరిగిందని సీఐ కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిందని తెలిపాడు.