కేసీఆర్ జాతీయ పార్టీ అనంతరం ఏపీలోనూ పాగా వేస్తాం – మంత్రి గంగుల కమలాకర్‌

కేసీఆర్ జాతీయ పార్టీ అనంతరం ఏపీలోను పాగా వేస్తాం అన్నారు మంత్రి గంగుల కమలాకర్‌. గత రెండు రోజులుగా ఏపీ మంత్రులు మంత్రి హరీష్ రావు ఫై, తెలంగాణ ఫై విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టిఆర్ఎస్ నేతలు సైతం వైస్సార్సీపీ నేతల కు కౌంటర్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పటికే పలువురు స్పందించగా..శనివారం కరీంనగర్‌లో మంత్రి మీడియా సమావేశంలో మాట్డారు. మంత్రి హరీశ్‌రావు, కేసీఆర్‌ను విడుదీసేలా ఏపీ మంత్రులు అమర్నాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ సారథ్యంలోని జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనూ పాగా వేస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబంలాంటిదైతే.. కేసీఆర్‌ తండ్రిలాంటి వారన్నారు. తమ కుటుంబంలోంచి ఒకరిని వేరుచేసే కుట్రలు ఫలించవచ్చన్నారు. బీజేపీకి బీ టీమ్‌లా పని చేస్తూ.. ఎదురించే ధైర్యం లేకుండా రైతుల పొట్టకొట్టేలా మీటర్లు పెట్టిన ఏపీ ప్రభుత్వం ఎక్కడ.. ధైర్యంగా బీజేపీని ఎదిరించిన సీఎం కేసీఆర్‌ ఎక్కడ అంటూ ప్రశ్నించారు. మహారాష్ట్ర, కర్నాటక, ఏపీలో కేసీఆర్‌ నాయకత్వం కావాలని ఫ్లెక్సీలు వెలిసిన విషయాన్ని గుర్తు చేశారు.

దేశానికి మార్గదర్శకంగా ఎదుగుతున్న తెలంగాణను ఓర్వలేకుండా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వైసీపీ జతకలిసిందని ఆరోపించారు. గుజ‌రాత్, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల క‌న్నా తెలంగాణ ప‌థ‌కాలు ఎలా ఆదర్శమో.. అలాగే ఏపీ విష‌యంలోనూ హరీశ్‌రావు మాట్లాడార‌న్న గంగుల.. దీన్ని ఎదుర్కొనే దమ్ములేకనే వ్యక్తిగత హననం చేస్తున్నారని మండిపడ్డారు.