ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక
హైదరాబాద్ః తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు నగరంలోని ఎల్బీ స్టేడియంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసం వద్ద కాన్వాయ్ను అధికారులు సిద్ధం చేశారు. ఆయన ఇంటివైపు వెళ్లే మార్గాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
మరోవైపు రేవంత్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ముఖ్యనేతలు హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా వారు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి స్వయంగా రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. 10.30గంటలకు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్సింగ్, 10.45కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మధ్యాహ్నం 12 గంటలకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రానున్న నేపథ్యంలో మిగతా హస్తం నేతలు వారికి స్వాగతం పలుకుతారు.
మరో వైపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజనర్సింహా, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ థాక్రే ఫోన్ చేశారు.ఒక్కరికే ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.