కేఏ పాల్ కు షాక్ : ప్రజాశాంతి పార్టీ గుర్తింపు రద్దు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

కేంద్ర ఎన్నికల సంఘం కేఏ పాల్ కు షాక్ ఇచ్చింది. ప్రజాశాంతి పార్టీ గుర్తింపును రద్దు చేసింది. ప్రస్తుతం కేంద్రం ఎన్నికల సంఘం వద్ద అనేక పార్టీలు రిజిస్టర్ అయ్యాయి. ఐతే ఇందులో చాలా పార్టీలు యాక్టివ్‌గా లేవు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పార్టీల ప్రక్షాళన మొదలుపెట్టింది. క్రియాశీలంగా లేని పార్టీలపై వేటు వేస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా క్రియాశీలంగా లేని 253 రాజకీయ పార్టీల గుర్తింపును, వాటి గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం రద్దుచేసింది.

అంతేకాదు మనుగడలోని మరో 86 పార్టీలను ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించింది. తెలంగాణ నుంచి రిజిస్టర్‌ అయిన 20 పార్టీలు ప్రస్తుతం క్రియాశీలకంగా లేవని చెప్పిన ఈసీ.. ఆయా పార్టీల గుర్తింపును రద్దు చేసింది. అందులో కేఎల్ పాల్‌ కు చెందిన ప్రజాశాంతి పార్టీ కూడా ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి అఖండ భారత్ నేషనల్ పార్టీ, అఖిలాంద్ర మహాదేశం, ఆలిండియా ముక్తి ధాల్ పార్టీ, ఆలిండియా ముత్తఅహీదా, ఆంధ్ర ప్రదేశ్ నవోదయ ప్రజా పార్టీ, భారత్ అభ్యుదయ పార్టీ, మన పార్టీ, నేషనలిస్టిక్ తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రజా భారత్ పార్టీ, ప్రజా పార్టీ సూరజ్ పార్టీలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి.

చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ల నివేదికను అనుసరించి వాటిపై తదుపరి చర్యలు తీసుకోనున్నామని ఈసీ వెల్లడించింది. తెలంగాణ , తమిళనాడు , కర్నాటక, మహారాష్ట్ర బీహార్ , ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నుంచి ఈ పార్టీలు నమోదయ్యాయని పేర్కొంది. ఇవి ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని.. తాము జారీ చేసిన నోటీసులు, లేఖలకు ఎలాంటి స్పందన తెలిజయేడం లేదని ఎన్నికల సంఘం వెల్లడించింది. 2014, 2019లో జరిగిన ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కానీ.. లోక్‌ సభ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదని తెలిపింది. 253 పార్టీల్లో 66పార్టీలు కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. ఎన్నికల్లో పోటీ చేయలేదని వెల్లడించింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం.. రిజిస్టర్ రాజకీయపార్టీలు ఐదేళ్లలోపు ఎలక్షన్ కమిషన్ నిర్వహించే ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీచేయాలి. ఒకవేళ ఏ పార్టీ అయినా వరుసగా ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకపోతే.. ఆ పార్టీని రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి ఎన్నికల సంఘం తొలగిస్తుంది.