పార్టీ మార్పుపై స్పందించిన శిల్పా చక్రపాణిరెడ్డి
అమరావతిః శ్రీశైలం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మళ్లీ టిడిపిలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై చక్రపాణిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అబద్ధాలను పదేపదే చెప్పి వాటిని నిజాలుగా నమ్మించడంలో టిడిపి అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడని విమర్శించారు. ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసి తాను వైఎస్ఆర్సిపిలోకి వచ్చానని… అలాంటి తను మళ్లీ టిడిపిలోకి ఎలా వెళ్తానని ప్రశ్నించారు.
తనకు మంత్రి పదవి రావచ్చు, రాకపోవచ్చని… పదవుల విషయంలో తాను ఏనాడూ అసంతృప్తి చెందలేదని అన్నారు. సీఎం జగన్ జనాల్లోకి వస్తే ఎవరూ తట్టుకోలేరని… అయితే ముఖ్యమంత్రిగా ఆయన చాలా బిజీగా ఉంటున్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పెడుతున్నారని… అందరికీ ముఖ్యమంత్రి న్యాయం చేస్తారని అన్నారు. నెలాఖరులోగా గుడ్ న్యూస్ చెపుతారనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. నారా లోకేశ్ కు బుర్ర లేదని… ఆయన ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.