11న ఈడీ విచారణకు హాజరుకానున్నఎమ్మెల్సీ కవిత

మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీలో కవిత ప్రెస్ మీట్

kavitha

హైదరాబాద్‌ః ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరవుతారా లేదా అన్న అంశంపై సందిగ్థతకు తెరపడింది. ఈ నెల 11న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరుకానుంది. ఈ నెల 9న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ అధికారులకు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపారు. అయితే ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున ఈ నెల 9న రాలేనని ఈడీకి సమాచారం ఇచ్చారు. 15వ తేదీ విచారణకు వస్తానని ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఈ లేఖపై ఈడీ స్పందించకపోవడంతో 11వ తేదీన అయినా విచారణకు హాజరవుతానని ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌కు మరో లేఖ పంపారు. దీనికి స్పందించిన ఈడీ అధికారులు..11న విచారణకు హాజరయ్యేందుకు అనుమతిచ్చారు.

కాగా, లిక్కర్ స్కాం కేసు విచారణ నేపథ్యంలో ఈడీ జాయింట్ డైరెక్టర్ కు లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత… హడావుడిగా కేసును దర్యాప్తు చేయడం ఏంటి అని లేఖలో అడిగినట్లు తెలుస్తోంది. తక్కువ సమయంలో తనను విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని లేఖలో ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. రాజకీయ కక్షలో భాగంగానే నోటీసులు జారీ చేసినట్టు ఆమె ఆరోపించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నా కార్యాలయానికి రావాలని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు చట్టపరమైన అన్ని హక్కులూ ఉపయోగించుకుంటానని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఈడీ విచారణ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు.