శ్రద్ధా వాకర్ కేసు.. అఫ్తాబ్పై హత్య అభియోగాలు
న్యూఢిల్లీః శ్రద్ధా వాకర్ హత్య కేసులో అఫ్తాబ్ పూనావాలాపై ఢిల్లీ కోర్టు హత్యానేరం కింద కేసు నమోదు చేసింది. అంతేకాకుండా సాక్ష్యాలు మాయచేసినందుకు అతడిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. నిందితుడు అఫ్తాబ్ పూనావాలాపై ఐపీసీ సెక్షన్లు 302 (హత్య), 201 (సాక్ష్యాధారాల మాయం చేయడం) కింద ఈ నేరాలకు సంబంధించి ప్రాథమికంగా కేసు నమోదు చేసినట్లు అదనపు సెషన్స్ జడ్జి మనీషా ఖురానా కక్కర్ తెలియజేశారు. ఈ హత్యకు సంబంధించి గతేడాది నవంబర్లో కేసు నమోదు చేసిన పోలీసులు 75 రోజుల తర్వాత ఈ సంవత్సరం జనవరిలో 6,629 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు.
కాగా, మే నెల 2022లో అఫ్తాబ్ పూనావాలా, శ్రద్ధా వాకర్లు ఢిల్లీలో అద్దె గది తీసుకొని సహజీవనం చేశారు. అయితే కొద్ది రోజుల నుంచి శ్రద్ధా నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆమె ఫ్రెండ్ శ్రద్ధా తండ్రిని సంప్రదించాడు. కూతురు జాడ తెలియకపోవడంతో ఆమె తండ్రి అక్టోబర్లో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఢిల్లీలో అఫ్తాబ్ గదిలో పోలీసులు శ్రద్ధా వాకర్ శరీర భాగాలు గుర్తించారు. DNA పరీక్షలు చేసి అవి శ్రద్ధా శరీర భాగాలుగా గుర్తించారు. పూనావాలా తన ప్రియురాలు అయిన శ్రద్ధా వాకర్ను అతి కిరాతంకా చంపి శరీరాన్ని 35 భాగాలుగా నరికి ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో పడేశాడు. నవంబర్లో అరెస్ట్ అయిన అఫ్తాబ్ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నాడు.