మీరు ఇప్పటికైనా రిటైర్ అవుతారా లేదా?: అజిత్ పవార్
శరద్ పవార్పై అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు..
ముంబయిః నేషలిస్ట్ పార్టీ అధినేత శరద్ పవార్పై అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు 58 సంవత్సరాలకు ఉద్యోగ విరమణ చేస్తారని, ఐఏఎస్-ఐపీఎల్లు 60 సంవత్సరాలకే పదవీ విరమణ చేస్తారన్నారు. బీజేపీ రిటైర్మెంట్ వయసును 75 సంవత్సరాలకు పెట్టుకుందనిని అజిత్ పవార్ పేర్కొన్నారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి సైతం పదవీ విమరణ చేశారన్నారు. వయసులో పెద్దవారని, 83 సంవత్సరాలు వచ్చినా ఇప్పటికీ రాజకీయాల్లో కొనసాగుతారా? అంటూ ప్రశ్నించారు. మీరు ఇప్పటికైనా రిటైర్ అవుతారా లేదా? కొత్త తరం ఎదగడానికి ఆశీస్సులు ఇవ్వాలన్నారు.
సుప్రియను అధ్యక్షురాలిగా చేయమని అడిగారని, తాము అందుకు సిద్ధమయ్యామన్నారు. ఆ తర్వాత రాజీనామాను వెనక్కి తీసుకున్నారని, రాజీనామాను ఎందుకు వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తాను అబద్ధం చెప్పనని, చెబితే తనను పవార్ కొడుకు అని పిలవొద్దన్నారు. సీనియర్లు విశ్రాంతి తీసుకోవాలని తాను భావిస్తున్నానన్నారు. శరద్ పవార్ తనను అందరి ముందు విలన్గా చిత్రీకరించారని, ఆయన అంటే తనకు ఇప్పటికీ గౌరవం ఉందన్నారు.
శివసేనతో పొత్తుపై స్పందిస్తూ.. 2017లో శివసేన కులతత్వంతో వ్యవహరిస్తోందని.. అందుకు ఆ పార్టీతో కలిసి వెళ్లొద్దన్నారని, 2019లో మాత్రం శివసేనతో కలిసి అధికారంలోకి వచ్చామన్నారు. అప్పుడు కలిసి నడవనప్పుడు.. ఇప్పుడెలా నడిచారంటూ ప్రశ్నించారు. మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు షిండే భిన్నమైన పాత్ర పోషించారని, ఈ విషయాన్ని పెద్దలకు చెప్పామని, ఏదో జరుగుతోందని ఉద్ధవ్ ఠాక్రేకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఏక్నాథ్ షిండే శివసేన విడిపోవాలని నిర్ణయించుకొని గౌహతికి క్యాంప్కు వెళ్లిన సమయంలో 51 మంది ఎమ్మెల్యేలు బిజెపికి మద్దతు ఇద్దామని ప్రతిపాదించామని.. కానీ, సీనియర్లు దానిపై నిర్ణయం తీసుకోలేదన్నారు.