స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు ఎలాంటి తప్పిదాలు చేయలేదుః సుప్రీంకోర్టు న్యాయవాది

సీమెన్స్ ప్రాజెక్టుపై ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదన్న చంద్రబాబు న్యాయవాది

sc-lawyer-pramod-kumar-arguments-in-acb-court-behalf-of-chandrababu

అమరావతిః స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. తొలుత చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దుబే వాదనలు వినిపించారు. ఈ కేసులో చంద్రబాబు ఎలాంటి తప్పిదాలు చేయలేదన్నారు. నాటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి సునిత గుజరాత్‌కు వెళ్లి ఈ స్కీమ్‌పై అధ్యయం చేశారని, ఆ తర్వాత సీమెన్స్ ప్రాజెక్టుపై ఆమె ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదన్నారు. సీమన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఆమోదం పొందిందని, ఇందుకు ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్‌మెంట్ ధరను నిర్ధారించిందని, కానీ ఆ కమిటీలో చంద్రబాబు లేరన్నారు.

ఈ కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పైన ఉన్నారని, ఈ బెయిల్‌ను సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకు పొడిగించిందన్నారు. చంద్రబాబుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని, ఆ తర్వాత విచారణ చేపట్టారన్నారు. సీఐడీ రెండు రోజులు ఆయనను కస్టడీకి తీసుకొని కూడా విచారించిందన్నారు. ఇప్పుడు మరోసారి కస్టడీ కోరుతున్నారని, అసలు ఆ అవసరం ఏముంది? అన్నారు. కేబినెట్ ఆమోదం తర్వాతే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చిందని, కేబినెట్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబుపై కేసు ఎలా పెడతారని దుబే వాదనలు వినిపించారు. ఆ తర్వాత విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది.